etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, April 13, 2019

ధోనీని కనీసం రెండు మ్యాచులైనా నిషేధించాల్సింది: సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్ వివాదాలకు కేంద్రంగా మారింది. రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్‌ని ‘మన్కడింగ్’ చేసి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రస్థాయిలో వివాదం సృష్టించాడు. కాగా, గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. మరో వివాదానికి తెర తీశాడు. గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ నిర్ణయాన్ని నిరసిస్తూ ధోనీ మైదానంలోకి దూసుకొచ్చి వాగ్వాదానికి దిగిన విషయం విదితమే. అయితే అతడి చర్యపై ఓ మ్యాచ్‌ నిషేధం ఉంటుందని భావించినా కేవలం 50 శాతం జరిమానాతో సరిపెట్టారు. స్టోక్స్‌ వేసిన ఆఖరి ఓవర్‌ నాలుగో బంతి ఆటగాడి నడుముపైకి రావడంతో ముందుగా ఫీల్డ్‌ అంపైర్‌ ఉల్హాస్‌ గంధే నోబాల్‌గా ప్రకటించాడు. అయితే లెగ్‌ అంపైర్‌ బ్రూస్‌ ఆక్సెన్‌ఫోర్డ్‌ మాత్రం దీన్ని తిరస్కరించడంతో గంధే తన నిర్ణయానికి వెనక్కి తీసుకున్నాడు.

ఇదంతా డగౌట్‌ నుంచి చూస్తున్న ధోనీ ఆగ్రహంతో నేరుగా మైదానంలోకొచ్చి వాదనకు దిగాడు. ఇలా చేయడం ఐపీఎల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవల్‌ 2 నిబంధనను అతిక్రమించడమేనని, ఇందుకుగాను ధోనీ మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. ఐసీసీ రూల్స్‌ ప్రకారం అంపైర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే గరిష్ఠంగా ఓ టెస్టు, రెండు వన్డేల నిషేధం విధించవచ్చు. అయితే ధోనీకి కేవలం జరిమానా మాత్రం విధించడంపై కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. ఎంత సీనియర్ ఆటగాడు అయితే మాత్రం.. కేవలం జరిమాన విధించి వదిలేస్తారా..? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. టీం ఇండియా కోసం ధోనీ అంతగా కోప్పడటం తాను ఎప్పుడు చూడలేదని సెహ్వాగ్ అన్నారు. ‘‘అంత కోపం ఇండియా టీమ్ కోసం వస్తే నాకు చాలా సంతోషం. కానీ ఇప్పటివరకూ అతను ఇండియా కోసం అంత అగ్రహం వ్యక్తం చేయడం నేను ఎప్పుడు చూడలేదు.

కానీ చెన్నై కోసం అతను చాలా ఉద్వేగానికి గురయ్యాడు. అతను గ్రౌండ్‌లోకి రావాల్సిన అవరసం ఉందని నేను అనుకోవడం లేదు. అక్కడ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఉన్నారు. వాళ్లు నోబాల్ గురించి అంపైర్‌ని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ధోనీ గ్రౌండ్‌లోకి రావాల్సిన అవసరం లేదు. జరిమానా విధించడం చాలా చిన్న శిక్ష. కనీసం, అతన్ని ఒకటో, రెండో మ్యాచులు నిషేధించాల్సింది. ఎందుకంటే ఇది చూసి భవిష్యత్తులో మరెవరైనా కెప్టెన్లు అంపైర్లతో వాగ్వాదానికి దిగే అవకాశం ఉంది. అందుకే అతన్ని కనీసం రెండు మ్యాచులైనా నిషేధిస్తే.. అది ఇతరులకు హెచ్చరికలా ఉండేది’’ అని సెహ్వాగ్ అన్నారు.

The post ధోనీని కనీసం రెండు మ్యాచులైనా నిషేధించాల్సింది: సెహ్వాగ్ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2P6KGAR

No comments:

Post a Comment